అమెరికా కీలక అధికారుల నివాసాలపై డ్రోన్ల కలకలం

  • వర్జీనియా సైనిక స్థావరం వద్ద కూడా డ్రోన్ల సంచారం
  • వాణిజ్య డ్రోన్ల కన్నా వేగంగా ప్రయాణిస్తున్న వైనం
  • విదేశీ శక్తుల హస్తంపై అనుమానాలు.. ఎఫ్‌బీఐ దర్యాప్తు
అమెరికా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నేతల నివాసాలపై డ్రోన్లు సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్‌ల నివాసాల పరిసరాల్లో ఈ డ్రోన్లు కనిపించడంతో అమెరికా నిఘా వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఈ పరిణామంతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది.

గత కొన్ని రోజులుగా వర్జీనియాలోని లాంగ్లీ ఎయిర్ ఫోర్స్ బేస్ వంటి అత్యంత కీలకమైన సైనిక స్థావరాల వద్ద కూడా రాత్రి సమయాల్లో ఈ డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. సుమారు 20 డ్రోన్లు గుంపులుగా ఏర్పడి, తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ డ్రోన్లను ఎవరు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారనేది అధికారులకు అంతుచిక్కడం లేదు. ఇవి సాధారణ వాణిజ్య డ్రోన్ల కంటే చాలా వేగంగా ప్రయాణిస్తుండటంతో, వాటిని అడ్డుకోవడం సవాలుగా మారింది.

ఈ ఘటనలపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగరేషన్ (ఎఫ్ బీఐ), పెంటగాన్ ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించాయి. కీలక నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు ఇరాన్ లేదా ఇతర విదేశీ శక్తులు ఈ డ్రోన్లను ప్రయోగిస్తున్నాయా? అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.

పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రమైన వేళ అమెరికా గడ్డపైనే ఇలాంటి నిఘా నీడలు కమ్ముకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం నిఘా కోసమా? లేక భవిష్యత్తులో ఏదైనా దాడికి సంబంధించిన సన్నాహక చర్యలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

US drone scare
Marco Rubio
US officials residences
Pete Hegseth
Virginia Langley Air Force Base
FBI investigation
Pentagon
Foreign surveillance
US security
Drone attack threat

More Telugu News